భారత దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో కోట్లాది మంది ప్రజలు తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. లక్షలాది వాహనాలు విడుదల చేసే కాలుష్య భారం వాతావరణంపై తగ్గింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎప్పుడు లేని ప్రశాంతత కనిపిస్తుంది. ఇది నిజంగా చాలా మంచి విషయం. మనుషుల అలికిడి లేకపోవడంతో అడవిలోని జంతువులు కూడా రోడ్లపైకి సరదాగా వచ్చి స్వేచ్ఛగా చక్కర్లు కొడుతున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇలా భారత దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు ఎన్నో అరుదైన ప్రకృతి దృశ్యాలను చూసే అవకాశం ఏర్పడింది. తాజాగా పంజాబ్ లోని జలంధర్ లోని ప్రజలు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసి ముగ్ధులవుతున్నారు.
ఇండియాలో లాక్ డౌన్ కారణంగా చాలా విషయాలు ప్రజలను ఆశ్చర్యపరచడంతో పాటు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఓ వైపు మనుషులు, ట్రాఫిక్ జామ్ లేకపోవడం వలన జంతువులు రోడ్లపై తిరుగుతుంటే... మరో వైపు కాలుష్యం లేని కారణంగా రమణీయమైన ప్రకృతి దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. తాజాగా జలందర్ లోని ప్రజల తమ అపార్ట్ మెంట్ లు, ఇళ్ల నుండి అద్భుతమైన హిమాలయ దృశ్యాలను చూడగలిగారు. అవును ఈ అరుదైన దృశ్యం పంజాబ్ లోని జలంధర్ ప్రజలను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. జలందర్ నుండి హిమాలయ దృశ్యాలు స్పష్టంగా కనిపించడం చాలా అరుదు. దీనికి సంబంధించిన ఒక ఫోటోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి ప్రవీణ్ కస్వాన్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. గత 100 సంవత్సరాలలో ఇలాంటి దృశ్యాన్ని ప్రజలు చూసి ఎరుగరు. లాక్ డౌన్ కారణంగా స్వచ్చమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుండడంతో హిమాచల్ ప్రదేశ్ లోని ధౌలధర్ పర్వత శ్రేణి యొక్క అందమైన దృశ్యాలు మొదటి సారిగా జలంధర్ నుండి ఆవిష్కృతమయ్యాయి.